● తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు
● పక్కాగా ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే జోగారావు
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వీరఘట్టం/పార్వతీపురం/సీతానగరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు పార్వతీపురం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర జనసంద్రమైంది. బస్సుయాత్ర అనంతరం పార్వతీపురం పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులతో పార్వతీపురం మున్సిపాలిటీలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని ప్రజలందరికీ తెలిసేలా ప్రధాన కూడళ్ల వద్ద డిజిటల్ స్క్రీన్ బోర్డులు ఏర్పాటు చేశారు. సీతానగరం నుంచి పార్వతీపురం ప్రధాన రహదారి చివరి వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ద్వారా అభివృద్ధి, సంక్షేమం వివరాలను ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరినీ అలరించాయి. దీంతో పార్వతీపురం మున్సిపాలటీ జగన్నామస్మరణతో మార్మోగింది.
వైఎస్సార్సీపీకే ఓటడిగే హక్కు
● రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు
వీరఘట్టం: ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్సార్సీపీకే ఉందని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు వీరఘట్టంలో శుక్రవారం నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో మీ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల సాయం పొందితేనే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. రానున్న ఆరునెలల పాటు వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంతో పనిచేసి మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ నియోజకవర్గ పరిశీలకుడు గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు తదితరులు పాల్గొన్నారు.