● సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
గోదావరిఖని(రామగుండం): రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక దుర్గానగర్లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పర్చుకున్న నిరుపేదలకు 100 గజాల లోపు స్థలానికి ఉచితంగా పట్టాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే చందర్ కృషితో రామగుండంలోని పేద ప్రజానీకానికి న్యాయం జరుగుతుందన్నారు. పట్టాలు రానివారిని గుర్తించి సాధ్యమైనంత త్వరలోనే అందజేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కోరుకంటి మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న, సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వాటికి జీవో 76 ప్రకారం పట్టాలు మంజూరు చేయించామని, ఈసందర్భంగా 326మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ బంగి అనిల్కుమార్, తహసీల్దార్ జాహెద్ పాషా, నాయకులు బాల రాజ్కుమార్, రాకేశ్, పాతపల్లి ఎల్లయ్య, అడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.