బురద చల్లడం చంద్రబాబుకు అలవాటే | Sakshi
Sakshi News home page

బురద చల్లడం చంద్రబాబుకు అలవాటే

Published Sun, May 16 2021 5:12 AM

Alla Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా విపత్కర సమయంలో కూడా చంద్రబాబు ప్రజల కోసం ఆలోచన చేయకుండా.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా బురద చల్లడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. శనివారం విశాఖలోని విమ్స్‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్‌ గొలగాని వెంకట హరికుమారితో కలిసి వైద్యాధికారులతో సమీçక్ష నిర్వహించారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నా కూడా.. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేసే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు.. కోవిడ్‌ రోగులకు సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. చేతనైతే కరోనా బాధితులకు సహాయం చేయాలని.. లేదంటే హైదరాబాద్‌లోని అద్దాల మేడల్లో తలుపులేసుకుని ఉండాలని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు మంత్రి ఆళ్ల నాని చురకలంటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తుంటే.. దానిని కూడా అవహేళన చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం వారి వివేకానికే వదిలేస్తున్నామన్నారు. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్‌ పేషెంట్లకే..
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్‌ రోగుల వైద్యానికి కేటాయించడం తప్పనిసరి అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్మేవారిపై.. రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విశాఖలో కరోనా నియంత్రణకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారన్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారని చెప్పారు.  

Advertisement
Advertisement