బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే | Sakshi
Sakshi News home page

బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే

Published Sat, Nov 21 2020 7:25 PM

Alliances With BJP Will Continue For Assembly Elections Says AIADMK - Sakshi

సాక్షి, చెన్నై : బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని, త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని అన్నాడీఎంకే చీఫ్‌ కోఆర్డినేటర్‌, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. శనివారం కేంద్ర మంత్రి అమిత్‌షా తమిళనాడు పర్యటన సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది. మేము పదేళ్ల పాటు మంచి పాలనను అందించాము. 2021 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాము. తమిళనాడు ప్రజలు ఎ‍ల్లప్పుడూ ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు’’ అని పేర్కొన్నారు. అమిత్‌షా కూడూ తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ( డీఎంకేకి షాక్‌.. అమిత్‌ షా- అళగిరిల భేటీ?!)

చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులో కరోనాను నియంత్రించడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంల కృషి అభినందనీయం. తమిళనాడులో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉంది. తమిళనాడును ఓ గర్భిణిలా ప్రభుత్వం చూసుకుంది. ఇలా ఏ ఇతర ప్రభుత్వం చేయలేదు. కుటుంబ రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్ధి చెబుతారు. 2జి స్కాంలో దొరికిపోయిన వారు రాజకీయాల గురించి మాట్లాడే హక్కులేదు’’ అని అన్నారు. 

Advertisement
Advertisement