Ambati Rambabu Fires On Chandrababu and Pawan Kalyan - Sakshi
Sakshi News home page

ఏడ్చే వారు రాజకీయాలకు పనికిరారు

Published Sun, May 1 2022 4:21 AM

Ambati Rambabu Fires On Chandrababu - Sakshi

అవనిగడ్డ: చంద్రబాబు ఏడ్చినప్పుడే టీడీపీ పని అయిపోయిందని, ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డలో నలుగురు నూతన మంత్రులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, మేరుగ నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తానేమీ అనకపోయినా ఏదో అన్నట్టు చంద్రబాబు ఏడ్చారని అన్నారు. గెలుపు ఓటములు, ఒడుదొడుకులు వచ్చినా హీరోలా ఉండేవారే రాజకీయాల్లో ఉంటారని చెప్పారు.

జగన్‌ వ్యతిరేక శక్తులందరినీ విడిపోనివ్వనని పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన సీఎం అవడానికి పార్టీ పెట్టారో, చంద్రబాబుని సీఎం చెయ్యడానికి పార్టీ పెట్టారో ముందు తేల్చుకోవాలని అన్నారు. అమర్‌నాథ్‌ మాట్లాడుతూ 2024లో మళ్ళీ జగన్‌ని సీఎంని చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. మేరుగ మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.1.32 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు సీఎం ఖర్చుపెట్టారని చెప్పారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం మిగతా రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషుబాబు, ఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ రవీంద్రనాథ్, అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతిని«ధి పి.రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement