Sakshi News home page

అమేథీ నుంచి పోటీ!.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

Published Tue, Apr 16 2024 8:00 AM

Amethi People Want Me to Represent Them Says Robert Vadra - Sakshi

మథుర: కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గతంలో కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టినప్పటికీ.. ఆయన వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది. ప్రశ్నార్థకంగా మారిన అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.

అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ని సందర్శించి, లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు.

రాబర్ట్ వాద్రా విలేకరులతో మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని, దేశంలో మార్పు వాతావరణం నెలకొందని అన్నారు. తన కుటుంబం మొత్తం దీనిపై శ్రద్ధగా పని చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా.. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటామని వాద్రా చెప్పారు.

అమేథీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రశ్నపై దేశంలోని ప్రతి మూలలో చర్చలు జరుగుతున్నాయని వాద్రా అన్నారు. ఇది ప్రజల పిలుపు. వారి కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు.నేను వారికి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు వినాలని వారు కోరుకుంటున్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను, ప్రస్తుతం తొందరపడటం లేదని ఆయన అన్నారు. అన్నారు. వాద్రా వెంట యూపీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మాజీ నేత ప్రదీప్ మాథుర్ ఉన్నారు.

ఒక వ్యక్తికి ఏ సమస్య వచ్చినా తన దేవుణ్ణి స్మరించుకుంటాడన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తి భగవంతుడిని స్మరించుకుంటే ధైర్యం పెరుగుతుందని.. అందుకే మతం పేరుతో వివక్ష రాజకీయాలు చేయకూడదని వాద్రా అన్నారు.

బీజేపీ 'వివక్ష రాజకీయాలు' చేస్తున్న పార్టీ అని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్‌ను సనాతన్ వ్యతిరేకి అని అనడం బీజేపీ సొంత పబ్లిసిటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, కూటమిని గెలిపించేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కష్టపడుతున్నారని చెప్పారు. దేశంలో సంతోషం, శాంతి నెలకొనాలని బాంకే బిహారీకి ప్రార్థిస్తున్నానని, రాహుల్, ప్రియాంక కచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.

అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. దీనిపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా బీజేపీ స్మృతి ఇరానీనే మళ్ళీ పోటీకి దింపింది.

Advertisement
Advertisement