AP Minister Ambati Rambabu Comments On Margadarsi And Ramoji Rao, Details Inside - Sakshi
Sakshi News home page

‘మార్గదర్శి’ మోసాలు.. మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

Published Fri, Nov 25 2022 12:07 PM

AP Minister Ambati Rambabu Comments On Margadarsi And Ramoji Rao - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలది చవకబారు రాజకీయం అంటూ దుయ్యబట్టారు.

‘‘ఇప్పటంలో చిన్న విషయంలో గగ్గోలు పెట్టారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని భ్రమ కల్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు విచారణలో నిజాలు బయటకొచ్చాయి. కోర్టును మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నట్టు తేలిపోయింది. చివరకు 14 మందికి రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది. పవన్‌ కల్యాణ్‌ అయితే ప్రభుత్వాన్నే కూల్చిపడేయాలన్నారు. కోర్టులనే మోసం చేసేందుకు కూడా వెనకాడలేదని’’ మంత్రి నిప్పులు చెరిగారు.

చిట్‌ఫండ్‌ కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మార్గదర్శి చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతోంది. రామోజీ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగా నిర్మితమయ్యాయని ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయని మంత్రి అన్నారు.

‘‘ప్రస్తుతం మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. రామోజీరావు చట్ట వ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారు మార్గదర్శి కూడా విచ్చలవిడిగాని నిబంధనలు ఉల్లంఘించింది. ష్యూరిటీలు లేని కారణంగా ఇవ్వడం లేదని మార్గదర్శి చెబుతుంది. పాడుకున్న వారి డబ్బులు మార్గదర్శిలోనే ఉండిపోతాయి. ఆ డబ్బులను తమ ఇతర సంస్థల్లోకి పెట్టుబడులుగా పెడుతోంది. పైసా లేకుండా వ్యాపారాలు చేసే వ్యక్తి రామోజీరావు. గత 50​‍-60 ఏళ్లుగా రామోజీరావు ఇదే చేస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

‘‘రామోజీరావు చట్టవ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారు. మొన్న జరిగిన సోదాల్లో మోసాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చిట్స్‌ సొమ్మును ప్రత్యేక ఖాతాలో వేయాలి. ప్రతి చిట్‌కు ఒక ఖాతా ఉండాలని చట్టంలో ఉంది. సోదాల్లో అధికారులు ఆ విషయాన్ని గుర్తించారు. చిట్‌ పాడుకున్న వారిని షూరిటీల పేరుతో వేధించి.. కొంతకాలం నగదును హోల్డ్‌ చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు.

‘‘మార్గదర్శి ఖాతాదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిట్టీలు వేసే వారు ఆలోచన చేసుకోవాలి. చట్టాలను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటాం. ఏ కంపెనీ అయినా నిబంధనలు పాటించాల్సిందే. రామోజీరావు చట్టానికి అతీతుడు కాడు. మేం కక్ష సాధిస్తున్నామనడం సరికాదు. అక్రమంగా డిపాజిట్లు తీసుకోబోమని కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసి ఇంకా డిపాజిట్లు తీసుకుంటూనే ఉన్నారు’’ అని మంత్రి రాంబాబు దుయ్యబట్టారు.
చదవండి: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే

Advertisement
Advertisement