ఇండియా కూటమికి కేజ్రీవాల్ షాక్ | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమికి కేజ్రీవాల్ షాక్

Published Sat, Feb 10 2024 4:27 PM

Arvind Kejriwal Party To Contest All Lok Sabha Seats In Punjab - Sakshi

చండీగఢ్‌: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. పంజాబ్‌లో ఉన్న13 లోక్‌సభ, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. 

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి ఐక్యకూటమి ఇండియాగా ఏర్పడ్డాయి. అయితే.. సీట్ల షేరింగ్‌ అంశంలో పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో  సీట్ల పంపకాలకు ఆప్ వర్గాలు సిద్ధంగా లేవు. సీఎం భగవంత్ మాన్‌ కూడా ఇప్పటికే ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. ఈ క్రమంలో పంజాబ్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని అప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు.

ఇండియా కూటమికి కీలక నేతలు బిహార్ సీఎం నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే షాక్ ఇచ్చారు. కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ ఇటీవలే స్పష్టం చేశారు. బెంగాల్‌లో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌తో విభేదాలు వచ్చిన క్రమంలో మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు.. బిహార్‌లో నితీష్ కుమార్ ఏకంగా బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు.  

ఇదీ చదవండి: 330 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాం: అమిత్‌ షా

Advertisement
Advertisement