ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్పై ఎంపీ బండి సంజయ్ విమర్శలు
హుజూరాబాద్: ‘మరో 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతోంది. ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి. మేం హామీలను అమలు చేయాలనుకున్నం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.. ఎన్నికలైపోంగనే అమలు చేస్తమని కాంగ్రెస్ నేతలు కాకమ్మ కథలు చెప్పబోతున్నరు’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో శనివారం ఆయన ప్రజాహిత యాత్ర కొనసాగింది. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో సంజయ్ మాట్లాడారు.
తమ పాలనలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్తో కుమ్మక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మెదీ మళ్లీ ప్రధాని కాబోతున్నారని గర్వంగా చెబుతున్నామని, మరి కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని ఎవ రో ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని నిలదీశారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు 80 రోజులు పూర్తయి నా అవి అమలు కాలేదని విమర్శించారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని, గ్యాస్ కనెక్షన్ మహిళల పేరిట ఉంటేనే గ్యారంటీలు అంటూ ముడిపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాగా, సంజయ్ను ఎంపీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో సంబురాలు చేసుకున్నాయి.