గ్రామాలపై బీజేపీ ఫోకస్‌.. ప్రచారానికి కొత్త కార్యక్రమం | Sakshi
Sakshi News home page

గ్రామాలపై బీజేపీ ఫోకస్‌.. ప్రచారానికి కొత్త కార్యక్రమం

Published Sun, Jan 21 2024 9:06 AM

BJP Starts Gaon Chalo Abhiyan Drive Rural Outreach - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని బీజేపీ ఓ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా ఉ‍న్న పార్టీ కార్యకర్తలు ‘గ్రామాలకు వెల్లండి’(గావో చలో అభియాన్)అని శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ ప్రచారం జరగనుంది. ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పేద ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. బూత్‌ స్థాయిలో మరింత ఎక్కువగా కార్యకర్తలు ప్రచారం చేయాలని అన్నారు.

సుమారు 7 లక్షల గ్రామాల్లో బూత్‌స్థాయిలో బీజేపీ కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వ విధానాల వివరిస్తూ ప్రజలతో మమేకం కావాలని అన్నారు. అర్బన్‌ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయటం కోసం పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో  ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇక.. ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్థానాల్లో భారీ మేజార్టీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  

చదవండి: కులమతాల చిచ్చు పెడుతున్నారు
 

Advertisement
Advertisement