బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎంపీ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎంపీ

Published Tue, Feb 6 2024 10:25 AM

BRS MP Venkatesh Netha Borlakunta Will Join In Congress - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక, పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ కాంగ్రెస్‌లో చేరారు. 

వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్‌ ఇంటికి ఎంపీ వెంకటేష్‌ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ కండువా కప్పి స్వాగతం పలికారు. 

కాగా, ఎంపీ వెంకటేష్‌ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. 

ఇక, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల వేళ సిట్టింగ్‌ ఎంపీ పార్టీ మారడం బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Advertisement