దేశాన్ని దోచుకునేందుకే బీఆర్‌ఎస్‌ | Sakshi
Sakshi News home page

దేశాన్ని దోచుకునేందుకే బీఆర్‌ఎస్‌

Published Mon, Oct 10 2022 2:58 AM

BSP President RS Praveen Kumar Slams On CM KCR Over BRS Party - Sakshi

మునుగోడు: తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు దేశాన్ని కూడా దోచుకునేందుకు బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఆదివారం కాన్షీరాం వర్థంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ తనకు ఆదాయం వస్తే చాలు, ప్రజల ఆరోగ్యాలు తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన, దేశంలో మతతత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలను మునుగోడు ఉపఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.

బహుజనుల రాజ్యాధికారం సాధించేందుకు కాన్షీరాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కాన్షీరాం స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని మునుగోడు ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి అందోజు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement