బాబు సభకు ముందే.. ఆళ్లగడ్డలో భగ్గుమన్న టీడీపీ, జనసేన విభేదాలు
Published
Mon, Jan 8 2024 9:11 PM
సాక్షి, నంద్యాల: అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి.
మంగళవారం ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి వస్తే తాను సైలెంట్గా ఉన్నా తన అనుచరులు ఊరుకోరని చెప్పిందట అఖిల ప్రియా.. దీంతో రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు బాబు సభకు జనసేన నేతలు కూడా వేదికపైకి రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. ‘మీ సభ మీ ఇష్టం, మేం ఎందుకు వస్తాం’ అని జనసేన నేతలు చెప్పేశారట. దీంతో ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు జనసేన సైడ్ అయిపోయింది. ఈ మేరకు ఆళ్లగడ్డ జనసేన ప్రకటన విడుదల చేసింది. ‘టీడీపీ సభకు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు. రేపు జనసైనికులు, నేతలు టీడీపీ సభకు వెళ్లొద్దు’అని ఆదేశించింది.