సింగరేణి తెలంగాణ కంపెనీనే, కానీ..: సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

సింగరేణి అచ్చం తెలంగాణ కంపెనీనే, కానీ..: సీఎం కేసీఆర్‌

Published Tue, Nov 7 2023 3:08 PM

CM KCR Speech At Chennur BRS Praja Ashirvada Sabha - Sakshi

సాక్షి, మంచిర్యాల:  బీఆర్‌ఎస్‌కు బాస్‌లు ఢిల్లీలో ఉండరని.. తెలంగాణ ప్రజలే దీనికి బాస్‌లు అని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నాం మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.  

మందమర్రి బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో  కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కేసీఆర్‌. ‘‘కాంగ్రెస్‌ నాయకుల చేతిలో ఏమీలేదు. ఢిల్లీలో కట్క వేస్తే   ఇక్కడ ఆ పార్టీకి వెలుగు వస్తుంది. అంబేద్కర్‌ను పార్లమెంటు ఎన్నికలలో ఓడగొట్టింది ఈ కాంగ్రెస్‌ పార్టీనే. కానీ,  బీఆర్‌ఎస్‌కు ప్రజలే బాస్‌లు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టిందని అన్నారాయన. 

ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓడలు, విమానాలు, రైళ్లు  అన్ని ప్రైవేటైజేషన్‌ చేస్తోంది. పేకాట క్లబ్ డబ్బులు సంపాదించినోడు మంచిర్యాలలో  పోటీ చేస్తున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలి అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. 

‘‘ఈ సింగరేణి అచ్చం తెలంగాణాదే. సింగరేణి మన తెలంగాణ కంపెనీ. కానీ, కేంద్రం వద్ద అప్పులు తెచ్చి అది కట్టలేక నలభై తోమ్మిది శాతం వాటాల్ని కేంద్రానికి  అమ్మింది కాంగ్రెస్ పార్టీనే.  ప్రాజెక్టులు కట్టలేక  ముంచింది  కాంగ్రెస్. సింగరేణి డిపెండెంట్‌  ఉద్యోగాలు   ఊడగోట్టింది‌ కాంగ్రెస్, కమ్యూనిస్టు లే’’ అని మండిపడ్డారాయన. ‘‘సూట్ కేసులతో  వచ్చే  వాళ్లు కావాలనా.. జేబులో  పైసలు లేని సుమన్ కావాలనా?  మీరే నిర్ణయం తీసుకోని ఓట్లు  వేయండి’’ అని ప్రజలను కోరారాయన. ‘సుమన్  రాకముందు, సుమన్ వచ్చిన తర్వాత.  చెన్నూరు  ఏలా మారిందో  చూసి ఓట్లు వేయాలి.  సుమన్   మా ఇంట్లో  ఉంటాడు.. నాతో  ఉంటాడు. చైతన్యంతో ఆలోచించి  బీఆర్‌ఎస్‌కు  ఓటు  వేయాలి’ అని ప్రజలను కోరారాయన. 

మహబూబ్‌నగర్, నల్లగొండ,మెదక్  జిల్లాలో  సగం ప్రజలు వలసపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారాయన. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. ఓటును అమ్ముకోవద్దు. వాళ్లెవరో చెప్పారని ఓటు వేయొద్దు. ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించండి. పార్టీ అభ్యర్థి నడవడికను విచారించి ఓటేయాలి అని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Advertisement
Advertisement