Sakshi News home page

'బోస్ ఉండుంటే దేశ విభజన జరిగేది కాదు' ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్‌..

Published Sun, Jun 18 2023 1:27 PM

Congress Hits Out At NSA on His Partition Claims As Doval Among Tribe Of Distorians  - Sakshi

ఢిల్లీ:నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దేశ చరిత్రపై మాట్లాడుతూ ధోవల్ వంచకుల పక్షాన చేరిపోయాడని సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. బెంగాల్ విభజనకు  మద్ధతు తెలిపిన వ్యక్తుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన‍్నారని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు. జనసంఘ్ తదనంతరం బీజేపీగా అవతరించింది.

ధోవల్ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్..నేతాజీ గాంధీపై ఛాలెంజ్ చేశారా? బోస్ వామపక్షవాదా? లౌకికవాదా? అని ప్రశ్నలు సందిస్తూ బోస్ ఉంటే దేశం విడిపోకుండా ఉండేదా? ఎవరు చెప్పగలరు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నేతాజీ అన్నయ్య శరత్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బెంగాల్ విభజనను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమర్థించారని అన్నారు.

నెహ్రూ, బోస్ జీవితాలపై రుద్రాంక్షు ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ధోవల్‌కు పంపిస్తానని జైరాం రమేశ్ అన్నారు. ఆ విధంగానైనా ధోవల్ సరైన చరిత్రను తెలుసుకుంటారని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్మారక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అజిత్ ధోవల్ మాట్లాడారు. బోస్ ధైర్య సాహసాల గురించి చెప్పే క్రమంలో.. నేతాజీ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపాయి.

ఇదీ చదవండి:బోస్‌ ఉంటే దేశ విభజన జరిగేది కాదు

Advertisement
Advertisement