ఇక్కడ బీజేపీకి ఒక్క ఎంపీ సీటూ రావొద్దు | Sakshi
Sakshi News home page

ఇక్కడ బీజేపీకి ఒక్క ఎంపీ సీటూ రావొద్దు

Published Mon, Apr 1 2024 5:51 AM

CPM BV Raghavulu Comments on BJP Leaders - Sakshi

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపు

బీజేపీలో ఉంటే నీతిపరులు, లేదంటే అవినీతిపరులవుతున్నారని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తొందని... మతోన్మాద వాతావరణాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీ ఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం జరగ్గా ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గద్దెదించడం తక్షణ రాజకీయ కర్తవ్యమన్నారు.  బీజేపీలో ఉంటే నీతిపరులు లేదంటే అవినీతిపరు లు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019లో వచ్చిన ఫలితాలు రావేమోననే భయంతోనే బీజేపీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిందని ఆరోపించారు.

ఫోన్‌ట్యాపింగ్‌ అప్రజాస్వామికం: ఎస్‌ వీరయ్య
ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం అప్రజాస్వామికమని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవితో పాటు కరువు ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా కు రూ. 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరిన వీరయ్య..  మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.  పార్ల మెంటు ఎన్నికల్లో సీపీఐ వైఖరిని  ప్రకటించాలని ఆయన కోరారు. అవసరమైతే సీపీఐ, సీపీఎం సంప్రదించుకుంటాయని, వర్తమాన రాజకీయ పరిణామాలను చూసి ఎవరికి మద్దతివ్వాలో  త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వీరయ్య వెల్లడించారు.

Advertisement
Advertisement