25 గ్యారంటీల మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం | CWC Approval For 25 Guarantees For Upcoming Lok Sabha Elections, Know Details Inside - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: 25 గ్యారంటీల మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం

Published Tue, Mar 19 2024 3:03 PM

CWC approval For 25 Guarantees For Upcoming Lok sabha Polls - Sakshi

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలకుపైగా ఈ సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించారు. మొత్తం 25 గ్యారంటీల అమలుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ‘పాంచ్‌ న్యాయ్‌’ పేరుతో అయిదు అంశాలతో మొత్తం 25 గ్యారంటీల మేనిఫెస్టోను ఖరారు చేశారు. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొన్నారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘హిస్సేదారి న్యాయ్‌’, ’కిసాన్‌ న్యాయ్‌’, ’నారీ న్యాయ్‌’, ’శ్రామిక్‌ న్యాయ్‌’,’యువ న్యాయ్‌’ పేరిట హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. 

పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్‌ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు, పేపర్‌ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. 

మేనిఫెస్టోలోని 25 గ్యారంటీలు

హిస్సేదారి న్యాయ్:
1. సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు కులాల ఆధారంగా జన గణన.
2. రాజ్యాంగ సవరణ ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రస్తుతమున్న 50 శాతం గరిష్ట పరిమితి తొలగింపు. 
3. జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్.
4 అటవీ హక్కుల వివాదాలకు ఏడాదిలోపు పరిష్కారం.
5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపు.

కిసాన్ న్యాయ్ : .
1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత.
2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు.
3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు.
4. రైతులు లబ్ధి పొందేలా సుస్థిర ఎగుమతి దిగుమతి విధానం
5. వ్యవసాయ ఇన్‌పుట్స్‌పై జీఎస్టీ మాఫీ.

శ్రామిక్ న్యాయ్ :
1. రైట్ టు హెల్త్ చట్టం
2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం 
3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్ భీమ
5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల 

యువ న్యాయ్:
1. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు,(నెలకు  8,500 చెల్లింపు)
3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు 
5. యువత స్టార్టప్  కోసం ఐదు వేల కోట్లు కేటాయింపు 

నారీ న్యాయ
1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం.
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు.
3. ఆశ, అంగన్వాడి, మిడ్ డే మీల్ వర్కర్లకు ఇచ్చే జీతంలో కేంద్రం వాటా రెట్టింపు. 
4. మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి గ్రామంలో అధికారి మైత్రి ఏర్పాటు 
5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టళ్ల పెంపు

Advertisement
Advertisement