'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు' | Sakshi
Sakshi News home page

'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు'

Published Thu, Oct 15 2020 10:07 PM

Dasoju Shravan Fires On KCR Neglecting Nor Taking Actions On Heavy Rains - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ ని తీర్చిదిద్దితే .. గత ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కష్టపడి విశ్వనగరంను కాస్త విషాదనగరంగా మార్చేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.గురువారం గాంధీభ‌వ‌న్ లో నిర్వహించిన స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. ' గ్రేటర్ హైదరాబాద్ లో  ఇవాళ ఎక్కడ చూసిన బురదే కనిపిస్తుందన్నారు. ఇళ్లన్నీ నీటిలో మునిగాయి. ఓపెన్ నాలాల్లో నీళ్ళతో పాటు ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, భాద్యత రాహిత్యం వల్ల, అవసరమైన నిధులు ఖర్చు చేయకుండా, కిలో మీటర్ల కొద్ది ఓపెన్ నాళాలు వున్నా, కనీసం వాటికి మూసివేయాలన్న, పెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న సోయి లేకుండా, ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేసి జీహెచ్‌ఎంసీని అప్పులు మయం చేశారు.

కానీ గ్రేటర్ హైదరాబాద్ ని గాలికి వదిలేశారు. వర్షాలు ప్రతి ఏటా పడాతాయి. గతంలో కూడా పెద్ద పెద్ద వర్షాలు, వరదలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంత సిద్దంగా వున్నాయన్నది ముఖ్యం. కోస్తా ప్రాంతాల్లో చూసుకుంటే హెచ్చరికలు జారీ అయిన వెంటనే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమౌతారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తారు. అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను వాళ్ళ కర్మకే వదిలేసి చేతులు దులుకునే పరిస్థితి కనిపించడం అత్యంత బాధాకరం. 

టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గులేదు. భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్య విష‌యంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. కేవ‌లం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వంద మంది వర్షానికి మరణించినట్లు త‌మ‌కు నిర్దిష్టమైన సమాచారం వుంది. కానీ ప్రభుత్వం చనిపోయిన వారి లెక్కలు కూడా సరిగ్గా చెప్పడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలివి లేదు. తెలంగాణ వచ్చినాక మంచి అర్బన్ డెవలప్‌మెంట్ పాలసీ వుండాలని కలలు కన్నాం. కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాం. రింగ్ రోడ్ అవతల కూడా అభివృద్ధి ఉండాలనే విజన్ తో  నిర్మించిన కట్టడం అది. అలా జరిగితే హైదరబాద్ పై లోడ్ తగ్గుతుంది. ఇక్కడ ట్రాపిక్, డ్రైనేజీ కంట్రోల్ వుంటుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి తెలివి మోకాళ్ళలో వుంది. పరిమితులకు దాటి అనుమతులు ఇచ్చి మొత్తం నగరంలోనే పెద్దపెద్ద భవనాలు రోడ్లపైనే నిర్మించే పరిస్థితి. అందమైన హైదరాబాద్ ని. గార్డెన్ సిటీ లాంటి హైదరాబద్ ని ఒక గార్బేజ్ సిటీగా మార్చేసిన చరిత్ర కేసీఆర్‌దే' అంటూ దుయ్యబట్టారు.

Advertisement
Advertisement