Sakshi News home page

పరువు నష్టం కేసు వేసిన బీజేపీ.. రాహుల్‌, డీకేఎస్‌, సిద్ధరామయ్యకు సమన్లు

Published Wed, Jun 14 2023 6:52 PM

Defamation Case Rahul Gandhi Siddaramaiah DK Shivakumar Summoned - Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ కీలక నేతలకు మరో షాక్‌ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం కాంగ్రెస్‌ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఓ పేపర్‌ ప్రకటనే ఇందుకు కారణమైంది. మే 5వ తేదీన పబ్లిష్‌ అయిన పత్రికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓ యాడ్‌ ఇచ్చింది. బీజేపీని 40 శాతం అవినీతి పార్టీగా ఎద్దేవా చేస్తూ.. అందులో గత నాలుగేళ్లలో బీజేపీ  లక్షన్నర కోట్ల డబ్బు దోచుకుందని ఆరోపించింది. ఈ ప్రకటన ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్‌ మే 9వ తేదీన ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌.. రాహుల్‌ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ చేసిన మోదీ వ్యాఖ్యలు.. పరువు నష్టం దావాకి దారి తీయగా, ఈ ఏడాది మొదట్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్‌ కోర్టు. ఆ శిక్ష కారణంగానే ఆయన తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా.

ఇదీ చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీం!

Advertisement
Advertisement