మోదీ ‘అన్యాయ్‌కాల్‌’కు కౌంట్‌డౌన్‌ మొదలైంది | Sakshi
Sakshi News home page

మోదీ ‘అన్యాయ్‌కాల్‌’కు కౌంట్‌డౌన్‌ మొదలైంది

Published Fri, Feb 16 2024 4:09 AM

Digvijay Singh comments over modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ హయాంలోని పదేళ్ల ‘అన్యాయ్‌కాల్‌’కు కౌంట్‌డౌన్‌ మొదలైందని, త్వరలోనే అది ముగుస్తుందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. మోదీ ఇచ్చిన హామీలు గత పదేళ్ల కాలంలో ఒక్కటి కూడా అమలు కాలేదని, కానీ వాగ్దానాలతో చేసిన ఆయన ప్రసంగాలు ఇంకా ప్రజల జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తున్నాయని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

గురువారం ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గాంధీభవన్‌లో విలేకరులతో  మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన సందర్భంగా పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీని రెండేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో రైతుల తాజా ఆందోళనను నిలువరించేందుకు డ్రో న్‌లు ఉపయోగించి గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ పాలనలో గ్యాస్‌ సిలెండర్‌ ధరలు రెండింతలు పెరిగాయని, దేశ అప్పులు మూడు రెట్లు పెరిగాయని, దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరిన పఠాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు గురువారం దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఆయనను దీపాదాస్‌మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement
Advertisement