మీ లింగన్న లాగే అందుబాటులో ఉంటా: సుజాత

7 Oct, 2020 20:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సోలిపేట సుజాత ...ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా బీ ఫామ్‌ అందుకున్న ఆమె కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సోలిపేట సుజాత మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. మీ లింగన్న లాగే మీకు (దుబ్బాక ప్రజలకు) నేను అందుబాటులో ఉంటాను. అత్యధిక మెజార్టీతో గెలవాలని కేసీఆర్ గారు  చెప్పారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాను’ అని అన్నారు. (సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం)

దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోలిపేట సుజాత ‘ సీఎం కేసీఆర్‌ నాకు తండ్రిలాంటివారు. నా భర్త రామలింగారెడ్డి చనిపోతే చిట్టాపూర్‌కు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. రామలింగారెడ్డి ఆశయాల సాధన కోసం నాకు టికెట్‌ ఇచ్చిన కేసీఆర్‌కు జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది’ అని అన్నారు. తన భర్త ఆశయ సాధన కోసం వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని చేతులు జోడించి వేడుకున్నారు. రామలింగారెడ్డి తుదిశ్వాస వరకూ ప్రజల మధ్యనే గడిపారని తాను కూడా ప్రజల్లోనే ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. (దుబ్బాక బీజేపీలో ముసలం)
.

మరిన్ని వార్తలు