మేజిస్ట్రేట్‌ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఈవీఎం! | Sakshi
Sakshi News home page

మేజిస్ట్రేట్‌ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఈవీఎం!

Published Fri, Feb 11 2022 3:43 PM

UP Elections 2022 EVM Been Taken In Car Trunk - Sakshi

లక్నో : యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం మొదటి దశలో 58 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, ఓటింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం నంబర్ ప్లేట్ లేని ఓ కారులో ఈవీఎం యంత్రం కనిపించడం వివాదాస్పదంగా మారింది. యూపీలోని కైరానా వద్ద షామ్లీ-పానిపట్ హైవేపై నంబర్ ప్లేట్ లేని కారులో ఈవీఎం యంత్రాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలు గుర్తించారు. సదరు కారు కైరానా జోనల్ మేజిస్ట్రేట్‌ స్టిక్కర్‌తో ఉండటంతో ఎస్పీ నేతలు ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌ కారులోని ఈవీఎంను తెరిచి పరిశీలించారు. ఈ క్రమంలో ఎన్నికల భద్రతా నియమావళిని ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ అంగీకరించారు. దీంతో ఎస్పీ నేతలు ఈ పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై షామిలీ జిల్లా మేజిస్ట్రేట్ జస్మీత్ కౌర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. జోనల్ మేజిస్ట్రేట్ కారులో ఈవీఎం యంత్రం ఉండటం నిజమేనన్నారు. అయితే కారు డ్రైవర్‌ భోజనం చేయడానికి వెళ్లిన సమయంలోనే ఈవీఎంను కారులో పెడుతున్న విషయాన్ని తాము గమనించామని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.

Advertisement
Advertisement