ఈటలకు మల్కాజ్‌గిరి ఫిక్స్‌!.. బీజేపీ నేతలతో కీలక భేటీ? | Etela Rajender Will Contest In Malkajgiri Assembly Constituency For Lok Sabha Elections 2024, Details Inside - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: మాల్కాజ్‌గిరి బరిలో ఈటల.. బీజేపీ నేతలతో కీలక భేటీ?

Published Wed, Feb 28 2024 8:20 AM

Etela Rajender Will Contest In Malkajgiri Assembly Constituency - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్‌గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్‌ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్య­ర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్‌–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్‌–బండి సంజయ్, నిజామాబాద్‌–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్‌–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్‌–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్‌ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
Advertisement