పవన్‌కు మానసిక చికిత్స అవసరం: గ్రంధి శ్రీనివాస్‌ | Sakshi
Sakshi News home page

భీమవరం గుర్తుందా?.. పవన్‌కు మానసిక చికిత్స అవసరం: గ్రంధి శ్రీనివాస్‌

Published Wed, Mar 13 2024 10:03 AM

Grandhi Srinivas Serious Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం. పవన్ మానసిక స్థితి ఆశ్చర్యం కలిగిస్తుందని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్. పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. 

బుధవారం ఉదయం గ్రంధి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తున్నాను. పవన్‌కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. పవన్‌ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. 

చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్నావ్‌. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే భాష ఏంటి?. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. ఇప్పటికే 21 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో అంటూ హితవు పలికారు. 

సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవికి.. పవన్‌కు అసలు పోలికే లేదు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18  సీట్లు గెలిచారు. పవన్‌కు లాగా సంస్కారం లేక విమర్శలు చేయలేక రాజకీయాల నుండివెళ్ళిపోయారు. మరో సొంత అన్న నాగబాబుకి కూడా పవన్‌ అన్యాయం చేశారు. 2019లో ఓటమి తర్వాత పవన్‌ మళ్లీ భీమవరం వైపు చూడలేదు. కోవిడ్‌ సమయంలో కూడా ఇక్కడి ప్రజల్ని ఏమయ్యారో అని పట్టించుకోలేదు. భీమవరం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పవన్‌ తెలుసుకోవాలి. నేను రౌడీనని పవన్‌ అంటున్నారు. మరి నా మీద ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు కదా? అని జనసేన అధినేతను గ్రంధి శ్రీనివాస్‌ సూటిగా ప్రశ్నించారు.

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కంఠస్తం పట్టి మాట్లాడుతున్నాడు. కోవిడ్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా మీరు?. సినీ ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయాల్లో ఇమడలేరు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే పెద్ద పెద్ద సంస్థలన్నీ భీమవరం వచ్చాయి. వాటిని నా చేతులతో ప్రారంభించాను. అభివృద్ధి, నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నాను. భీమవరం జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవి సైతం వదులుకున్నాను. 100 పడకల ఆసుపత్రి కోసం మా కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఇచ్చాను. ఇప్పటివరకు 185 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించాము. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొలేకనే చంద్రబాబు కూటమితో వస్తున్నాడు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారు. కరోనా సమయంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు చేరువ చేశారు. చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన వెబ్‌సైట్‌ నుంచి తొలగించాడు. చంద్రబాబు ఎన్నికల ముందు దండాలు పెట్టి ఎన్నికల తర్వాత పంగనామాలు పెడతారని ప్రజలకు తెలుసు. ప్రజలు సీఎం జగన్‌ వెంట ఉన్నారు. కూటమికి అధికారం వచ్చే ఛాన్స్‌ లేదు. అవినీతికి తావు లేకుండా పేదల గడప వద్దకు సంక్షేమాన్ని చేరువ చేశారు. 

నిలకడ లేని మాటలు పూనకాలు వచ్చే ప్రసంగాలతో పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ మానసిక స్థితి బాలేదు. ముద్రగడ పద్మనాభం ఇంటిని 5,000 మంది పోలీసులు మొహరించి.. వారి కుమారుడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లి వారి భార్యను అనకూడని మాటలంటే నాడు ఆయనకు ఎందుకు సంఘీభావం తెలపలేదు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో పవన్‌ చేతులు కలిపారు. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని హరిరామజోగయ్య సలహాలు ఇస్తే ఆయన్ను కూడా అవమానించిన వ్యక్తి పవన్‌. చంద్రబాబుకు పవన్‌ బానిసలా మారిపోయారు. పవన్‌కు సంబంధించి చంద్రబాబు దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో.. ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో.. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.

పవన్ కళ్యాణ్ స్థాయి దిగదారి నన్ను విమర్శలు చేస్తున్నారు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్న రామాంజనేయులును కృష్ణాజిల్లా నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చారు. తరిమికొడితే పారిపోయే వ్యక్తిని కాదు నేను.. చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాను. ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పనిచేశాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో సీఎం జగన్‌ ఆశీస్సులతో సంక్షేమ పాలన అందిస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి జగన్‌ వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా?. మీరు పార్టీ, కులం వదిలి సీఎం జగన్‌ను బలపరచండి’ అని వ్యాఖ‍్యలు చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement