ఇది ద్వంద్వ నీతి కాదా? | Sakshi
Sakshi News home page

ఇది ద్వంద్వ నీతి కాదా?

Published Sat, Jan 27 2024 4:40 AM

Harish Rao Serious Comments On Tamilisai Soundararajan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గజ్వేల్‌: రాజకీయ పార్టీల్లో కొన సాగుతున్నారనే కారణంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిఫారసు చేస్తే, ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీగా ఆమోదించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘ఇది ద్వంద్వ నీతి కాదా? గవర్నర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కాదా?’ అని శుక్రవారం ‘ఎక్స్‌’లో నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని అన్నారు.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌ను అణగదొక్కాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో గవర్నర్‌ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని, అప్పుడు కూడా గవర్నర్‌ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీల విషయంలో ఒకే రకంగా ఉండాలని, కానీ గవర్నర్‌ బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారని విమర్శించారు.

ప్రాజెక్టుల అప్పగింత గొడ్డలిపెట్టు లాంటిదే.. 
కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించాలనే నిర్ణయం తెలంగాణకు గొడ్డలిపెట్టు లాంటిదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాలకు తాగు, సాగునీరు, విద్యుత్‌ అవసరా లకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. జల విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండదని అన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరి గిన బీఆర్‌ఎస్‌పీపీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు, ఇతర మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేద ని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభు త్వం.. ఢిల్లీలో సంతకాలు పెట్టిందంటూ కేంద్రం మినిట్స్‌ విడు దల చేయగా, రాష్ట్ర మంత్రులు మేం సంతకాలు పెట్టలేదని మాట్లాడటం శోచనీయమని అన్నా రు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

దీనిపై కేంద్ర జలవనరుల శాఖామంత్రిని తమ పార్టీ పార్లమెంటరీ బృందం కలిసి వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపా రు. కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌పై బురద చల్లడం మానుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆదిలాబాద్‌కు వచ్చిన ప్పుడు సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరిస్తామని మాట ఇచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్‌షా తన మాటను నిలబెట్టుకోవాలని, బీసీ గణన చేపట్టాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement