హిందూ ఏక్తా ర్యాలీలో అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

హిందూ ఏక్తా ర్యాలీలో అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

Published Sun, May 14 2023 8:55 PM

Himanta Biswa Sarma Bandi Sanjay At Hindu Ekta Yatra Rally Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ఓవైసీపై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యుడు ఉన్నంత వరకు హిందుత్వం, సనాతన ధర్మం ఉంటుందన్నారు. పదేళ్ళ క్రితం అయోధ్యలో రామ మందిరం అవుతుందని ఎవరూ అనుకోలేదని, కానీ ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తైందన్నారు.

భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని, తెలంగాణలో రామరాజ్యం రాబోతుందని పేర్కొన్నారు. ఓవైసీ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దేశంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలు చేస్తామని తెలిపారు. హిందూత్వం లేకుండా భారత దేశం లేదన్నారు. అసోంలో 98 రూపాయలకే పెట్రోల్ వస్తుందని.. తెలంగాణలో పెట్రోల్‌ ధర 108 రూపాయలు ఉందని విమర్శించారు.

‘అసోంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వస్తుంది. తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు రావు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం పేరు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలు మద్యం వ్యాపారం చేస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. భారతదేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుంది. ఈ రోజు పాకిస్థాన్ పరిస్థితి చూడండి. హిందూ దేవుళ్ళను నమ్మని వారి పరిస్థితిని చూడండి. వారి దుస్థితి చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్  నెంబర్ వన్ కాబోతుంది.  
చదవండి: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు.. సీఎం డిసైడయ్యేది ఆ రోజేనా!

మీరు ఒక్కసారి కేరళ స్టోరీ చూడాలి. హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా తయారు చేస్తారో చూపించారు. లవ్ జిహాద్ అరికట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓవైసీ నన్ను చూసుకుంటా అని బెదిరించారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను. ఓవైసీ ఇంట్లోకి కూడా వస్తా ఏం చేస్తాడో చూడాలి. రజాకార్ రాజ్యం పోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో మార్పు వస్తుంది. రామరాజ్యం వస్తుంది అని అసోంలో చెప్తాను.’ అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. 

హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తామని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక శక్తులకు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. అందుకోసమే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూత్వం లేకుంటే దేశం పాకిస్థాన్‌ అయ్యేదని అన్నారు. తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తానని చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement