Huge Protest In Tripura Assembly - Sakshi
Sakshi News home page

త్రిపుర అసెంబ్లీలో నిరసనలు.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి..

Published Fri, Jul 7 2023 4:17 PM

Huge Protest In Tripura Assembly  - Sakshi

అగర్తలా: త్రిపుర అసెంబ్లీలో నిరసనల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో అశ్లీల వీడియోల వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే జడాబ్ లాల్ దేబ్‌నాథ్‌ను సస్పెండ్ చేయాలని త్రిపుర మోత పార్టీ(టీఎంపీ), సీపీఐ-ఎమ్‌, కాంగ్రెస్‌లు డిమాండ్ చేశాయి. అశ్లీల వీడియో అంశంపై చర్చిండానికి ప్రతిపక్ష నేత అనిమేష్ డెబ్బర్మ వేసిన వాయిదా తీర్మాణాన్ని స‍్పీకర్ తిరస్కరించగా.. సభలో నిరసనలు మొదలయ్యాయి. అయితే.. మరికాపేటికే ఎమ్మెల‍్యేల సస్పెన్షన్‌ నిర్ణయంపై స్పీకర్ వెనక్కి తగ్గారు.

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్‌ 2023-2024 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. ప్రతిపక్షాలు నిరసనలు ప్రారంభించాయి. ప్రతిపక్ష నేతలు పోడియంలోకి ప్రవేశించారు. నినాదాలు చేస్తూ.. ఒకరికొకరు చేతులు కలుపుతూ గొలుసు మాదిరిగా ఏర్పడ్డారు. మరికొందరు నేతలు బల్లాల మీదకు ఎక్కారు.

దీంతో స్పీకర్ బిశ్వ బిందు సేన్‌ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సుదిప్ రాయ్‌ బర్మన్, నాయన్ సర్కార్, బ్రిషకేతు డెబ్బర్మ, నందితా రియాంగ్, రంజిత్ డెబ్బర్మలు సస్పెన్షన్ లిస్ట్‌లో ఉన్నారు. దేబ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.  మళ్లీ అదే రోజు ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయాన్ని స్పీకర్‌ వెనక్కి తీసుకున్నారు. 

అయితే.. ఈ ఏడాది ఆరంభంలో సభ జరుగుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యే దేబ్‌నాథ్‌ అశ్లీల వీడియో చూస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై దేబ్‌నాథ్ స్పందిస్తూ ఫోన్‌ కాల్ లిఫ్ట్‌ చేసే క్రమంలో ఆ సైట్ అకస్మాత్తుగా ఓపెన్ అయిందని, వెంటనే క్లోజ్ కూడా చేశానని అప్పట్లోనే సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి: గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు

Advertisement
Advertisement