DK Shivakumar Said That I Have No Differences With Siddaramaiah - Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

Published Sun, May 14 2023 4:40 PM

I Have No Differences With Siddaramaiah Says DK Shivakumar - Sakshi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను మించి స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో ఏకంగా 136 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకుంది. 1989 తర్వాత కాంగ్రెస్‌ 43 శాతం ఓట్‌ షేర్‌ను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు బీజీపీ 65 స్థానాలకే పరిమితం కాగా జీడీఎస్‌ 19, ఇతరులు 4 చోట్ల విజయం సాధించింది.  2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పుంజుకోవడానికి  ముఖ్యంగా భావిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. 

అయితే కర్ణాటక సీఎం ఎవరనేదానిపై తాజాగా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో పార్టీ సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయం కాంగ్రెస్‌ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఆదివారం కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌

సీఎల్పీ సమావేశంలో నిర్ణయం
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నేతలు నేడు (ఆదివారం) సాయంత్రం 5.30 నిమిషాలకు బెంగుళూరులో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎన్నికపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అయితే మరో రెండు రోజులపాటు కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం పేరును పార్టీ హైకమాండ్‌ నిర్ణయించాలని సీఎల్పీ భేఈటీలో నేతలు తీర్మానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అధిష్టానం ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది.

అయితే సీఎం పదవికి సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారని, ఆయన్నే ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ మొగ్గుచూపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా డీకే శివకుమార్‌కు డీప్యూటీ సీఎం పదవి లేదా మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ శిండే, జితేంద్ర సింగ్‌, దీపక్‌ బబారియాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలకులుగా నియమించింది.

సిద్ధరామయ్యకు అండగా నిలిచా
ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తుమకూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాకు సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ మా మధ్య అలాంటివి ఏం లేవు. ​పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశానని తెలిపారు. ఎన్నోసార్లు సిద్ధరామయ్యకు అండగా నిలిచానని, ఆయనకు సహకారం అందించానని చెప్పారు. మొదట్లో మంత్రిని చేయనప్పుడు ఓపిక పట్టలేదా అని అన్నారు.
చదవండి: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..

Advertisement
Advertisement