తెలంగాణలో బీజేపీకి ఈ స్పీడ్‌ సరిపోదు! ఆదేశాలు జారీ | Sakshi
Sakshi News home page

తెలంగాణలో బీజేపీకి ఈ స్పీడ్‌ సరిపోదు! ఆదేశాలు జారీ

Published Tue, Apr 11 2023 4:11 AM

Implementation of action plan for BJP to go to people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో 7, 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న కృషి సరిపోదని, తెలంగాణ లోని అన్ని వర్గాలను చేరుకుని కార్యక్రమాల వేగం పెంచాలని రాష్ట్ర బీజేపీని జాతీయ నాయకత్వం ఆదేశించింది.  ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించింది.

పార్టీలోని అన్ని విభాగాలు, 7 మోర్చాలు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర నాయకత్వం, వివిధ విభాగాలు, మోర్చాల   పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిలు తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌చార్జి అర్వింద్‌ మీనన్‌ రెండు, మూడు రోజులుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం జరిగిన ప్రధాని మోదీ సభతో పార్టీ ఎన్నికల శంఖం పూరించినట్టేనని తెలిపారు. 

ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం: అర్వింద్‌ మీనన్‌ 
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కిసాన్‌ ఇతర మోర్చాల జిల్లా ఇన్‌చార్జిలతో జాతీయ నాయకుడు అరి్వంద్‌ మీనన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం వేర్వే రుగా సమావేశమయ్యారు.  ఎస్సీ లు, ఎస్టీలు, ఓబీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా కులాలు, వర్గాలవారీగా ఓటర్లు, ప్రభా వం చూపే అంశాలపై లోతైన కసరత్తు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్‌ చేయాలని ఆదేశించారు. ఈ నియోజకవర్గాల్లో అధికస్థానాలు గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీని యూనిట్‌గా తీసుకుని అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయి, శక్తి కేంద్రం (మూడు, నాలుగు పోలింగ్‌ బూత్‌లు కలిపి ఒకటి), బూత్‌స్థాయి వరకు Ð వెళ్లేలా కృషి చేయాలని సూచించారు. 

ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతం...  
ఎస్సీ, ఎస్టీ మోర్చా రాష్ట్ర నేతలను మండలాల ఇన్‌చార్జీలుగా నియమించి 31 నియోజకవర్గాల్లోని ప్రతిబూత్‌లో పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని మోర్చాల నేతలు తెలియజేసినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ బస్తీల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, ఆయా వర్గాల్లోని మేధావులకు, విద్యావంతులకు బీజేపీ ఆలోచనలు, ఆశయాలను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సమావేశంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా, ఓబీసీ మోర్చా ఆలె భాస్కర్‌ రాజ్, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఎస్సీ మోర్చా ఇంచార్జి డా.జి.మనోహర్‌ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ పాల్గొన్నారు.   

Advertisement
Advertisement