జనసేనకు డ్యామేజ్.. పవన్‌ వీరభక్తులు ఏం చేయబోతున్నారు? | Sakshi
Sakshi News home page

జనసేనకు డ్యామేజ్.. పవన్‌ వీరభక్తులు ఏం చేయబోతున్నారు?

Published Sun, Jun 4 2023 8:57 PM

Dilemma with Pawan Kalyan Behaviour - Sakshi

తన రాజకీయాలన్నీ చంద్రబాబు కోసమే అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేయడంతో జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ నిర్మాణం జరగకపోయినా పవన్ మీది అభిమానంతో కొనసాగుతున్న కేడర్‌లో తాజా ప్రకటన అసహనం కలిగిస్తోందా? చంద్రబాబుతోనే తన ప్రయాణం అంటున్న పవన్‌కల్యాణ్ వీరభక్తులు ఏం చేయబోతున్నారు? 

ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పవన్ కళ్యాణ్‌కి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా పవన్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే నాయకుడే తమ ఆశలను తుంచేశారని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్సీపీని అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలనే అభిప్రాయాన్ని పవన్ వెల్లడించారు. ఇదే ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ చాలామంది టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీకి నిర్మాణం లేకపోయినా, కార్యకర్తల గురించి పవన్ ఏనాడు పట్టించుకోకపోయినా.. తమకోసం పవన్ కోసం ఏదో సాధిస్తాడని పరితపించారు. చంద్రబాబుతో కలసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ నిర్ణయించుకోవడాన్ని చాలామంది జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని విడిచిపెట్టడమే మార్గంగా భావించి బయటకు వెళ్లిపోతున్నారు.

ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, నేతలను టార్గెట్ చేసి మాట్లాడటం, చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం నడుచుకోవడం జరుగుతోంది. ఇద్దరి మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉన్నా, ఎక్కడా బయట పడకుండా ఇప్పటివరకు నెట్టుకొచ్చారు.

తాజాగా ముసుగు రాజకీయాన్ని బట్టబయలు చేసి, చంద్రబాబుకు తనకు మధ్య ఉన్న బంధాన్ని బాహ్య ప్రవంచానికి తెలియజేయడంతో.. జనసేన పార్టీని చాలా వరకూ డ్యామేజ్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య తాజా పరిణామాలు విభేదాలు సృష్టించాయి. పొత్తు కుదిరితే తమ సీటు ఎక్కడ పోతుందో అనే ఆందోళన మొదలైంది. దీంతో ఇరు పార్టీల నేతలు ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితి ఏర్పడింది.
చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? 

మరో వైపు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే పవన్ అభిమానులు, కార్యకర్తలు పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం జనసేనలో ముసలం పుట్టింది. ఇక్కడ పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేనకు గుడ్‌బై చెబుతున్నారు. మండపేట నుంచి గత మూడు సార్లుగా టీడీపీ నేత వేగుళ్ళ జోగేశ్వరరావు వరుసగా ఎన్నికవుతున్నారు. అందువల్ల టీడీపీజనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినా ఇక్కడ జనసేన పోటీ చేయడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. ఈ పరిణామాల నేపథ్యంలో తమకిష్టం లేని పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేకపోతున్న అనేక మంది జనసేన కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.
చదవండి: ‘వైఎస్‌ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’


 

Advertisement
Advertisement