CM KCR Counter To BJP Congress Secretariat Pragathi Bhavan Demolish - Sakshi
Sakshi News home page

కూల్చివేస్తామంటూ రేవంత్‌, సంజయ్‌ కామెంట్లు.. అసెం‍బ్లీలో సీరియస్‌ అయిన కేసీఆర్‌

Published Sun, Feb 12 2023 5:10 PM

KCR Counter To BJP Congress Secretariat Pragathi Bhavan Demolish - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయం, ప్రగతిభవన్‌పై విపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లురెక్కలు విరిచి పడేస్తారని మండిపడ్డారు. ఆ తమాషాలను ప్రజలే చూసుకుంటారని అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడుతూ..  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సందు దొరికితే బద్నాం చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. ఈటలకు అన్నీ తెలుసని, ఇక్కడి నుంచి అక్కడికి పోతే అన్ని మర్చిపోతారా అని ప్రశ్నించారు.  

‘దేశం ఇలా నాశనం అవుతుంటే చూడబుద్ది అవ్వట్లేదు. ఈ విశ్వగురువు వద్దు, దేశ గురువు ఉంటే చాలు. ఈ దేశంలో ఉన్న ఇరిగేషన్‌ పాలసీని గంగలో పడేసి కొత్త పాలసీ తెస్తాం. రాబోయేది మా ప్రభుత్వమే, చెప్పింది చేసి చూపిస్తాం. దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తాం. దేశం నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేకే ఈ తలనొప్పి పెట్టుకున్నా. విసుగొచ్చి రిటైర్మెంట్‌ సమయంలో ఈ దుక్కుమాలిన పెంట పెట్టుకున్నా.
చదవండి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ప్రపంచ యుద్దాలు జరిగినా జనగణన ఆపలేదు. మోదీ సర్కార్‌ ఎందుకు జనగణన చేపట్టడం లేదు. తన బండారం బయటపడుతుందనే చేయలేదు. జనాభా లెక్కలు లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా పాలన చేయడం లేదు. కాంగ్రెస్‌, బీజేపీ దేశాన్ని ముంచాయి. కాంగ్రెస్‌, బీజేపీ దొందు దొందే. కాంగ్రెస్‌ ది లైసెన్స్‌ రాజ్‌. మోదీ సైలెన్స్‌ రాజ్‌. కాంగ్రెస్‌ వాళ్లకు భావదారిద్రం. కాంగ్రెస్‌ వాళ్లుచేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతున్నారు. మన్మోహన్‌ హయాంలో 14శాతం అప్పులు తగ్గించారు.  

మోదీ ప్రభుత్వం మేము చెప్పిందే చేయాలని లేదంటే చంపుతాం అన్నట్టుంది. అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేడు. మోదీ తెచ్చిన ఏ పాలసీ సక్సెస్‌ అయ్యింది. నోట్ల రద్దు సక్సెస్‌ అయ్యిందా. మేకిన్‌ ఇండియా జోకింగ్‌ ఇండియా అయ్యింది. ఒక్క పోర్టు ఉన్న సింగపూర్‌ కంటే అధ్వానంగా ఉన్నాం. ఒక్క వందే భారత్‌ రైలును మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారు. బర్రె గుద్దితే వందే భారత్‌ రైలు పచ్చడైంది.  

ఎన్డీఏ అంటే నో డేటా అవెలబుల్‌. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైంది. మోదీ హయాంలో 54 శాతం అప్పులు పెరిగాయి. 2024లో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుంది. నేను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తా. నామాటకు కట్టుబడి ఉంటా.’ అని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రసంగించారు.
చదవండి: బీబీసీ.. ఈడీ, బోడీకి భయపడుతుందా?.. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ సెటైర్లు

Advertisement

తప్పక చదవండి

Advertisement