ఇండియా కూటమి నేతల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్ | Sakshi
Sakshi News home page

‘కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగడంపై ఎలాంటి సమాచారం లేదు’

Published Sat, Jan 27 2024 3:12 PM

Kharge Says No Information On JDU Leaving Alliance - Sakshi

పట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్‌బంధన్‌ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బిహార్‌ రాజకీయాలు వేడెక్కాయి.  ఇక.. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి నితీస్‌ కుమారు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌పై వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’నుంచి నితీష్‌ జేడి(యూ) పార్టీ వైదులుగుతుందన్న కచ్చితమైన సమాచారం లేదన్నారు. ఇక.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని  ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన ‘ఇండియా కూటమి’లో జేడీ (యూ)  ఓ కీలకమైన పార్టీ జేడీ(యూ) అని తెలిపారు. 

‘నాకు నితీష్‌ కుమార్‌ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం నేను లేఖ  కూడా రాశారు. వారితో మాట్లాడుదామని ప్రయత్నం చేశాను. కానీ, నితీష్‌​  కుమార్‌ మనసులో ఏం ఉందో నాకు తెలియదు’ అని ఖర్గే పేర్కొన్నారు. రేపు( ఆదివారం) ఢిల్లీ వెళ్లి బిహార్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ అనిశ్చితిపై పూర్తి సమాచారం తెలుసుకుంటానని.. ఈ వ్యవహారంపై చర్చ జరుపుతామని అన్నారు. నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయబోతున్న విషయం  తనకు  తెలియదని, గవర్నర్‌ను కలుస్తారన్న దానిపై కూడా తనకు స్పష్టత లేదని అ‍న్నారు. ఇక.. ఈ విషయంపై ప్రస్తుతం అధికారికంగా మాట్లాడలేనని అన్నారు. రేపటి వరకు  ఏం జరుగుతుందో చూస్తామని ఖర్గే తెలిపారు.

మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ సంబంధించిన నేతల ఫోన్లకు నితీష్ కుమార్ స్పందించకపోవటం గమనార్హం. సోనియా గాంధీ కాల్‌ చేసినా.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే మూడుసార్లు ఫోన్ చేసినా నితీష్‌ కుమార్‌ స్పందించలేదు. మరోవైపు.. లాలూప్రసాద్ యాదవ్ ఐదుసార్లు ఫోన్ చేసినా  నితీష్ లిఫ్ట్  చేయకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చదవండి: Bihar Politics: సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా నేడు?

Advertisement
Advertisement