Munugode By-Elections 2022: KTR Direction To Munugode TRS In-Charges - Sakshi
Sakshi News home page

Munugode By Election: గడువు ముగిసే వరకు కదలొద్దు

Published Fri, Oct 28 2022 1:08 AM

KTR direction to Munugode TRS in-charges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార గడువు ముగిసేంత వరకు పార్టీ ఇన్‌చార్జిలు తమకు కేటాయించిన చోట ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలతో గురువారం ఉదయం ప్రగతిభవన్‌ నుంచి కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 30న చండూరులో టీఆర్‌ఎస్‌ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు.

ఈ నెల 30న బహిరంగ సభ, 31న నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నందున ఈ రెండు రోజులను మినహా­యిస్తే ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచా­రం ముమ్మరం చేయాలని పార్టీ ఇన్‌­చార్జిలకు కేటీఆర్‌ సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రచారం ముగిసినా పోలింగ్‌ పూర్త­య్యేంత వరకు ఫోన్‌ ద్వారా పార్టీ స్థానిక యంత్రాంగాన్ని సమన్వ­యం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 30న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణను సవాల్‌గా తీసుకోవాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

మీడియా ముందు మాట్లాడొద్దు: కేటీఆర్‌
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మీడి­యా ముందు ఎలాంటి వ్యాఖ్యా­నాలు చేయవద్దని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ‘అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏ మాత్రం పట్టించుకోవద్దు’అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement