‘నినాదాలు కాదు.. మహిళలకు గౌరవం ఇవ్వటం నేర్చుకోండి’ | Sakshi
Sakshi News home page

‘నినాదాలు కాదు.. మహిళలకు గౌరవం ఇవ్వటం నేర్చుకోండి’

Published Sun, Apr 14 2024 6:58 PM

Lakshmi Hebbalkar response Ex BJP MLA Asks Karnataka Minister To Have Extra Peg - Sakshi

బెంగళూరు: కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్‌ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తీవ్రంగా ఖండించారు. సంజయ్‌ పాటిల్‌ ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు మహిళలకు మద్దతు పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు.

ఆమెకు నిద్ర పట్టాలంటే నిద్ర మాత్ర లేదా ఒక పెగ్గు ఎక్కువగా తాగాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సంజయ్‌ పాటిల్‌ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాజాగా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ వీడియో ద్వారా స్పందించారు.

‘బీజేపీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. మహిళలను కించపరచడమే బీజేపీ వాస్తవ అజెండా. జై శ్రీరామ్‌, బేటీ బచావో.. బేటీ పడావో వంటి నినాదాలు  ఇవ్వటం కాదు. ముందు మహిళలకు మర్యాదు ఇవ్వటం నేర్చుకోవాలి.  ఇదే మా హిందూ సంస్కృతి అని సంజయ్‌ పాటిల్‌ ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన చేసిన  వ్యాఖ్యలు నన్ను ఒక్కరిని అవమానించినట్లు కాదు.. మొత్తం కర్ణాటక రాష్ట్ర, దేశ మహిళల అవమానించినట్లు’ అని  లక్ష్మీ హెబ్బాల్కర్‌ మండిపడ్డారు. సంజయ్‌ పాటిల్‌ ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. 

ఇక..లోక్‌సభ ఎన్నికల్లో బెలగావి పార్లమెంట్‌ స్థానం నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్‌ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ పోటీచేస్తున్నారు. మరోవైపు.. బీజేపీ తరఫున ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బరిలో ఉన్నారు. జగదీష్‌ శెట్టర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవటంతో కాంగ్రెస్‌ చేరారు. మళ్లీ ఇటీవల తిరిగి బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన బెలగావి టికెట్‌ దక్కించుకున్నారు.

Advertisement
Advertisement