Lok Sabha elections 2024: నాలుగు రాష్ట్రాల్లో పొత్తు కాంగ్రెస్, ఆప్‌ ఒప్పందం | Sakshi
Sakshi News home page

Lok Sabha elections 2024: నాలుగు రాష్ట్రాల్లో పొత్తు కాంగ్రెస్, ఆప్‌ ఒప్పందం

Published Sun, Feb 25 2024 4:50 AM

Lok Sabha elections 2024: AAP-Congress finalise Lok Sabha seat sharing in Delhi - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం పూర్తయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ 4, ఆప్‌ 3 చోట్ల బరిలో దిగుతాయి. న్యూఢిల్లీ, వెస్ట్‌ ఢిల్లీ, సౌత్‌ ఢిల్లీ, ఈస్ట్‌ ఢిల్లీ స్థానాల్లో ఆప్, చాందినీ చౌక్, నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్‌ బరిలో ఉంటాయి. గుజరాత్‌లో 24 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో (భావ్‌నగర్, భరూచ్‌) ఆప్‌ పోటీ చేస్తాయి.

హరియాణాలో కురుక్షేత్ర స్థానంలో ఆప్, మిగతా 9 చోట్లా కాంగ్రెస్‌ బరిలో ఉంటాయి. గోవాలో మొత్తం రెండు సీట్లతో పాటు చండీగఢ్‌ లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెసే పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌ నేత ముకుల్‌ వాస్నిక్, ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ శనివారం ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.

పంజాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుతో సంబంధం లేకుండా అక్కడి 13 స్థానాల్లో విడిగానే పోటీ చేయాలని రెండు పారీ్టలూ నిర్ణయించాయి. గుజరాత్‌లో భరూచ్‌ స్థానాన్ని ఆప్‌కు కేటాయించడాన్ని దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ అహ్మద్‌ పటేల్‌ పలుమార్లు గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ టికెట్‌పై తాను పోటీ చేస్తానని, దీనిపై పార్టీ అధిష్టానాన్ని కలిసి చర్చిస్తానని ఫైజల్‌ చెప్పారు.

Advertisement
Advertisement