'బండి సంజయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది' | Sakshi
Sakshi News home page

'బండి సంజయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది'

Published Thu, Jan 7 2021 6:51 PM

Malladi Vishnu Fires On Chandrababu And Bandi Sanjay In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

'చంద్రబాబు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. ఆయన హిందూ మత ద్రోహిగా తయారవుతున్నారు. అధికారం ఉంటే కులంతో, అధికారం పోతే మతంతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? ఇంద్రకీలాద్రిపై క్షుద్ర పూజలు చేసింది మీరు కాదా? అమరావతి డిజైన్‌లో అమరేశ్వరుని బదులు బుద్ధుడ్ని ఎందుకు పెట్టారు? తుంగభద్ర పుష్కరాలు జరిగితే చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు? అప్పుడు చంద్రబాబుకు హిందూ మతం గుర్తులేదా? టీడీపీతో కలిసిన బీజేపీ ఆనాడే దేవాలయాలను కూల్చి విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో తీసుకెళ్లింది.

బండి సంజయ్ అనే నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. బైబిల్, ఖురాన్, భగవద్గీత కలిస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తించాలి . ప్రజలను రెచ్చగొట్టడంలో టీడీపీ, బీజేపీ సిద్ధహస్తులని చెప్పొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబును లోపలేస్తే రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటుంది. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడడంలో మా ప్రభుత్వం ముందుంది. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది...త్వరలో ఒక జీవో కూడా వస్తుంది.రేపు విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం చేస్తున్నామని' మల్లాది విష్ణు తెలిపారు.

Advertisement
Advertisement