‘రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’ | Sakshi
Sakshi News home page

‘రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’

Published Thu, May 18 2023 5:39 PM

Minister Jogi Ramesh Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: అయ్యన్నపాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో సమాధి కట్టుకోమని చంద్రబాబు మాట్లాడుతుంటే ఇక ఆయన్నేమనాలన్నారు. రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు టీడీపీకి సమాధి కడతారని మంత్రి ధ్వజమెత్తారు. పేదలకు మూడు సెంట్లు చొప్పున స్థలాలు ఇచ్చానని సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు మంత్రి జోగి రమేష్‌.

తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన జోగి రమేష్‌.. ‘శరవేగంగా జగనన్న కాలనీలు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయి. 2014నుండి 2019 వరకు సీఎం గా ఉండి ఒక్క సెంటైనా ఇంటికోసం ఇచ్చావా?, 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు జగన్ ఇంటిస్థలాలు ఇచ్చారు. వారంతా కలిసి చంద్రబాబును రాజకీయంగా సమాధి చేస్తారు. అసలు ప్రజలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకన?,  ఎస్సీల్లో ఎవరు పుట్టాలని అంటారు. బీసీల తోకలు కత్తిరిస్తామని అవహేళన చేశారు. ఓట్లప్పుడే మా వాళ్లు కావాలా మీకు?, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఏనాడైనా పట్టించుకున్నావా?

రాజధానిలో పేదలు ఉండకూడదా? ఇదెక్కడి చట్టం?, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజధానిలో నివసించే హక్కు లేదా?, హైకోర్టు, సుప్రీంకోర్టులదాకా వెళ్లి ఆపాలని చూడటం ఏంటి?,  కోర్టులు కూడా మనసున్న జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పాయి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోర్టుల్లో అడ్డుకోవాలని చూసినందుకు పేదలంతా చంద్రబాబును రాజకీయంగా పాతరేస్తారు. జగన్ లాంటి ధీరుడు, ధైర్యశాలిని ఎదుర్కోవడం చంద్రబాబు వల్ల కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు కాళ్లు నాకుతాను అంటూ వెళ్తున్నారు. నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కాదని పవన్ అన్నాడంటే అదీ జగన్ గెలుపు. పొత్తుల పేరుతో కట్టకట్టుకుని వచ్చే అన్ని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేయటానికి సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు  ఫ్రస్టేషన్‌తో రంకెలేస్తున్నారు. ఎన్ని కేకలు, అరుపులు వేసినా ప్రజలు నమ్మరు’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement