‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’ | Sakshi
Sakshi News home page

గొడవలు సృష్టించాలన్నదే చంద్రబాబు కుట్ర..

Published Fri, Feb 12 2021 11:32 AM

Minister Kodali Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: రేషన్ డోర్‌ డెలివరీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్‌పై కొన్ని పత్రికలు చెత్త రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఇంటింటికీ రేషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కుట్రలు చేయడం దిక్కుమాలిన టీడీపీకి అలవాటే. ఎన్నికల పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 7,200 వాహనాలు నిలిచేలా చేశారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 83 శాతం సీట్లు గెలిచాం. దేవినేని ఉమా నియోజకవర్గంలో 48 పంచాయతీల్లో 44 గెలిచాం. జూమ్ యాప్ పెట్టి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారని’’ ఆయన ఎద్దేవా చేశారు.

బాబు మాటలు నమ్మి పోటీ చేసి ఓడిపోయిన వారు ఇప్పుడు ఏడుస్తున్నారన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టించాలనేదే చంద్రబాబు కుట్ర అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని, రెండో దశ ఎన్నికలు వచ్చే సరికి పుతిన్‌, ఐక్యరాజ్యసమితికి కూడా లేఖ రాస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

‘‘మున్సిపల్ ఎన్నికల్లోపు రాష్ట్రంలో టీడీపీకి క్యాడర్‌ ఉండదు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం నడుస్తుంటే టీడీపీలో కిస్‌మిస్ నాయుడు రాజ్యాంగం నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడం ఏ రాజ్యాంగంలో ఉంది?. ప్రజాక్షేత్రంలో గెలవలేని లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌ స్థానానికి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుంది. తొలి దశ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. చంద్రబాబును పార్టీ నుంచి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం. సంక్షోభాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ నా వెనుక వస్తే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని’’ కొడాలి నాని పేర్కొన్నారు.
(చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్‌’ నిగ్గుతేల్చండి)
ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! 

Advertisement
Advertisement