Sakshi News home page

చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడా ఇదే: మంత్రి మేరుగు

Published Mon, Nov 27 2023 11:31 AM

Minister Merugu Nagarjuna Comments On Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, సామాజిక సమతుల్యత విరాజిల్లుతుందనడానికి నిదర్శనమే ఈ అంబేద్కర్ విగ్రహం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్వరాజ్యమైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను సోమవారం.. మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, సుమారు రూ. 420 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ భావించారు. త్వరితగతిన పనులు జరుగుతున్నాయి.  త్వరలోనే సీఎం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవమవుతుందని మంత్రి మేరుగ తెలిపారు. 

అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి చంద్రబాబు, లోకేష్‌కు అర్హత లేదు
లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా అంటూ మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్ ఎందుకు మాట్లాడలేదు?. అంబేద్కర్ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని చంద్రబాబు చూశాడు. చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు.  ఐదేళ్లలో పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి మేరుగ దుయ్యబట్టారు.

చారిత్రాత్మకమైన నిర్ణయం: మంత్రి కొట్టు సత్యనారాయణ
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడూతూ, భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుంది. అంబేద్కర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి సీఎం జగన్‌. దేశానికి ఆదర్శవంతమైన పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే అంబేద్కర్ భావజాలం. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం చారిత్రాత్మకమైన నిర్ణయం’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
చదవండి: వైద్యుడి ఆత్మహత్యపై టీడీపీ రాజకీయం

Advertisement

What’s your opinion

Advertisement