యశవంతపుర (కర్ణాటక): తాను సీఎం అవుతానని ఎక్కడా చెప్పలేదని మంత్రి మురుగేశ్ నిరాణి అన్నారు. శుక్రవారం బాగలకోటె జిల్లా బీళగి పట్టణ పంచాయతీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి బొమ్మై సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. మంత్రి మురుగేశ్ నిరాణి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిరాణికి సీఎం అయ్యే సత్తా ఉందని, బీసీలు, పేదలు, అట్టడుగు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఆయన సేవ చేయగలరని కొనియాడారు. నిరాణి సీఎం అవుతారని అనగానే కార్యకర్తలు పెద్దపెట్టున హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.