ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నుంచి పోటీ చేసి తనపై ఓడిపోయిన వ్యక్తికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ కష్టపడి గెలిపించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తాను తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదని గుర్తు చేశారు.
ఆదివారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకసారి ఖమ్మం, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన తనది కాదని, తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తనతో పాటు ఖమ్మం ఎంపీగా, లోక్సభా పక్ష నాయకులుగా నామా నాగేశ్వరరావుకు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కొండబాల కోటేశ్వరరావుకు, ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజకు.. ఇలా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. తమకు ఎవరు మేలు చేశారో ఈ సామాజికవర్గం వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.