రాయచోటి : సాధారణ గృహిణిగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో జీవితాంతం నడుచుకుంటానని ఎమ్మెల్సీ ఎం.జకియాఖానమ్ అన్నారు. సోమవారం ప్రభుత్వ చీఫ్విప్ జి.శ్రీకాంత్రెడ్డి, ఎంపీ పి.వి.మిథున్రెడ్డిలతో కలసి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీ కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి సీఎంను సత్కరించి కృతజ్ఞతలను తెలియజేశారు. పార్టీలో ఎంతోమంది మేధావులు, ఉద్దండులు ఉన్నప్పటికీ మైనార్టీ మహిళగా తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జగన్ రూపంలో దేవుడిచ్చిన వరంలా భావిస్తానన్నారు.
తన భర్త అఫ్జల్అలీఖాన్లా తాను కూడా వైఎస్సార్ కుటుంబానికి విధేయతగా పని చేసి పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఎమ్మెల్సీ అవకాశం రావడానికి సహకరించిన శ్రీకాంత్రెడ్డి, మిథున్రెడ్డిలకు కూడా ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలను తెలిపారు. వారి సహకారం, సూచనలతో రాష్ట్రంలోని మహిళల సమస్యలను మండలి ద్వారా వినిపించి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్సీకి సీఎం అభినందనలు..
మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలను తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎమ్మెల్సీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అసీఫ్అలీఖాన్, అంజాద్అలీఖాన్, అష్రఫ్అలీఖాన్లు కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.