సాక్షి, ఏలూరు జిల్లా: టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు. నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పోస్టర్లను ముద్రబోయిన పీకిపడేశారు. టీడీపీ తనను దారుణంగా మోసం చేసిందని, చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.
పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా. చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బతికించా. పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా. కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా.. నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు. పార్టీ కష్ట కాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు. ఈ రోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని ముద్రబోయిన ధ్వజమెత్తారు.
నేను ఏం తప్పుచేశానో చెప్పమంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల సమాధానం చెప్పలేకపోయారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెల్లడించారు.