మరో బాంబు పేల్చిన నితీష్‌ కుమార్‌.. | Sakshi
Sakshi News home page

మరో బాంబు పేల్చిన నితీష్‌ కుమార్‌..

Published Mon, Dec 28 2020 8:49 AM

Nitish Kumar Said He Did Not Want CM Position - Sakshi

పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి, నితీష్‌ కుమార్‌ జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో పార్టీ సీనియర్‌​ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్‌సీపీ సింగ్‌కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన గంటల వ్యవధిలోనే నితీష్‌ కుమార్‌ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు‌. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. సీఎం కుర్చికి నేను అంకితం కాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని సంకీర్ణానికి తెలియజేశాను. కానీ వారు అంగీకరించలేదు. ఎంతో ఒత్తిడి తర్వాత నేను మరో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఈ పదవి పట్ల నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు.. అక్కర్లేదు’ అని స్పష్టం చేశారు. ఇక నితీష్‌ వ్యాఖ్యలు ఎన్‌డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. (చదవండి: 21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!)

ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కూటమి రాజకీయాలకు ఇది మంచి సంకేతం కాదని స్పష్టం చేసింది. అయితే, అరుణాచల్ ఎపిసోడ్ బిహార్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపదని జేడీయూ పేర్కొంది

Advertisement
Advertisement