ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనతో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ పర్యటన ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పక్షనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ కూడా పోతుందని, ఆయన ఓటమి భయంతో ప్రస్తుతం మహారాష్ట్రలో అడుగుపెట్టారని ధ్వజమెత్తారు.
మరో వైపు బీఆర్ఎస్ నేతలు 12 నుంచి 13 మంది కాంగ్రెస్లో చేరారని రౌత్ అన్నారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి బలంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా .. బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్... జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలోని నాందేడ్లో ఆయన సభ నిర్వహించి, బీజేపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
కాగా.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు బీఆర్ఎస్ నేతలు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కుస్తీపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్లో ఉన్న ఆ పార్టీకి తాజాగా ముఖ్య నేతలు టీకాంగ్రెస్లోకి చేరడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి.