ఆశావహుల వడపోతకు నాయకత్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఆశావహుల వడపోతకు నాయకత్వం సిద్ధం

Published Mon, Feb 5 2024 4:08 AM

PEC meeting on 6th to finalize Congress Lok Sabha candidates: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఈనెల 3వ తేదీన ముగిసిన నేపథ్యంలో 6వ తేదీన టీపీసీసీ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో పాటు ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ హరీశ్‌చౌదరి, సభ్యులు జిగ్నేశ్‌ మేవానీ, విశ్వజిత్‌ కధమ్‌లు కూడా హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో భాగంగా పార్లమెంటు ఎన్నికల కోసం కార్యాచరణను రూపొందించుకోవడంతో పాటు ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఆశావహుల బయోడేటాలను పరిశీలించి, పారీ్టలో వారి అనుభవం, పనితీరు, గత ఎన్నికల్లో చేసిన కృషి తదితర అంశాల ఆధారంగా మొత్తం 306 దరఖాస్తులను పరిశీలించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను ఏఐసీసీకి సిఫారసు చేయనున్నట్టు సమాచారం. ఈ పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయనుందని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఈనెల 15వ తేదీ నుంచి ఎప్పుడైనా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశముందని గాం«దీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement