ఖమ్మంలో పువ్వాడ హ్యాట్రిక్‌ కొడతారా?.. మంత్రిని ఢీకొట్టేది ఎవరు? | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో పువ్వాడ హ్యాట్రిక్‌ కొడతారా?.. మంత్రిని ఢీకొట్టేది ఎవరు?

Published Sun, Aug 20 2023 7:32 PM

Puvvada Ajay Kumar Vs Ponguleti Srinivasa Reddy Khammam Seat - Sakshi

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్‌ సీట్‌గా మారనుందా? తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పువ్వాడకు పోటీగా నిలిచి గట్టి అభ్యర్థి ఎవరు? బలమైన ప్రత్యర్థి బరిలో నిలిస్తే పువ్వాడకు ఇబ్బందేనా? అసలు ఖమ్మంలో మంత్రి మీద పోటీ చేయబోయేది ఎవరు? 

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో సంచలనాలు సృష్టించబోతున్నాయి. పలు కీలక నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. అటువంటి వాటిలో ఖమ్మం అసెంబ్లీ సీటు కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇప్పటికి రెండు సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచేది తానే అంటూ ధీమాగా ఉన్నారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు.. ఖమ్మంలో చేసిన అభివృద్దిని చెప్పుకుంటు వచ్చే ఎన్నికల్లో తననే మరోసారి దీవించాలని కోరుతున్నారు. మళ్లీ గెలిపిస్తే ఖమ్మం నగరాన్ని ఇంకా అభివృద్ది చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్ నుంచి పొటీ తీవ్రంగా ఉండబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొంగులేటి అనుచరులు ఆయనపై ఖమ్మంలో పొటీ గురించి తీవ్రస్తాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని పొంగులేటి అనుకుంటున్నప్పటికీ... అనుచరుల ఒత్తిడి మేరకు ఖమ్మంలోనే నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. అనుచరబలం కూడ గట్టిగానే ఉంది.

కొత్తగూడెంలో ఓటు బ్యాంక్ ఉన్నా అనుచరుల బలం అంతగా లేదని టాక్. దీంతో ఫైనల్ గా తన అనుచరుల అభిప్రాయం మేరకు పొంగులేటి ఖమ్మం సెగ్మెంట్‌నే తన ఎన్నికల రణ క్షేత్రంగా ఏంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కీలక నిర్ణయాలను అనుచరుల సూచన మేరకే పొంగులేటి తీసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.  

అన్నీ అనుకున్నట్లు జరిగి, ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిస్తే ఈ సెగ్మెంట్ హాట్ సీట్ గా మారనుంది. అజయ్ వర్సెస్ పొంగులేటి మధ్య సై అంటే సై అన్నట్లు రసవత్తరమైన పోరు కొనసాగుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఏస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌ పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఖమ్మం ఓటర్లు డిసైడ్ అయిపోయారు.
చదవండి: గులాబీ బాస్‌ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే..

ఖమ్మంలో ప్రస్తుతం ఏ ఇద్దరిని కదిలించిన పొంగులేటి, పువ్వాడ అజయ్ పొటీ చేస్తే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ పోటీ చేయడం అనేది ఖాయమైంది. మరి కాంగ్రెస్‌ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయన పేరు కూడా ఖరారైంతే ఇక ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement