రాహుల్‌ ప్రధాని అయితే స్కాములే గతి | Sakshi
Sakshi News home page

రాహుల్‌ ప్రధాని అయితే స్కాములే గతి

Published Sat, Jul 1 2023 5:59 AM

Rahul becomes PM, scams and corruption will become India destiny - Sakshi

ఉదయ్‌పూర్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశం కుంభకోణాలు, అవినీతిమయంగా మారుతుందని హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి అయితే మోసగాళ్లంతా కటకటాల వెనక్కి వెళ్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. పట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష నేతల భేటీపై ఆయన..‘అక్కడ సమావేశమైన వారంతా అవినీతితో సంబంధం ఉన్నవాళ్లే.

వారి ఆరాటమంతా తమ కుమారుల భవిష్యత్తు కోసమే తప్ప ప్రజలకు మంచి చేయడం కాదు’అని విమర్శించారు. ‘రాహుల్‌ గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యం. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ లక్ష్యం తేజస్వీయాదవ్‌ను ప్రధానిని చేయడం, తన మేనల్లుడు అభిషేక్‌ను సీఎంను చేయడమే మమతా బెనర్జీ లక్ష్యం. కొడుకు వైభవ్‌ గెహ్లాట్‌ను సీఎంను చేయడం అశోక్‌ గెహ్లాట్‌ లక్ష్యం’అని ఆయన ఎద్దేవా చేశారు.

రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్‌ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే, ఇప్పటికే నిందితులకు ఉరిశిక్ష పడి ఉండేదని పేర్కొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం గహ్లోత్‌ వల్లే నిందితులకు శిక్ష పడటం ఆలస్యమవుతోందని ఆరోపించారు. సస్పెండైన బీజేపీ నేత నుపుర్‌ శర్మకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కన్హయ్య లాల్‌ అనే దర్జీని గత ఏడాది ఇద్దరు దుండగులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కన్హయ్యలాల్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం రక్షణ కలి్పంచలేకపోయిందని మంత్రి అన్నారు.

Advertisement
Advertisement