కాంగ్రెస్‌లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర

Published Sun, Jan 7 2024 6:00 AM

Sajjala Ramakrishna Reddy Sensational Comments on YS Sharmila and Congress - Sakshi

సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌లో షర్మిలమ్మ చేరడం వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహా దారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక అధికారం కలే అని గ్రహించిన చంద్రబాబు.. దింపుడుకళ్లం ఆశలతో ఈ కుట్రకు పాల్ప డ్డారని మండిపడ్డారు. వెలగపూడిలోని తాత్కా­లిక సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ను చేతిలో పెట్టుకున్న చంద్రబాబు.. తన మనుషుల ద్వారా ఒక వైపు కాంగ్రెస్‌ను.. మరో వైపు బీజేపీని మేనేజ్‌ చేస్తున్నారని, మీడియా ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని అన్నారు.

ఆ కుట్రలో భా గంగానే షర్మిలమ్మ కాంగ్రెస్‌లో చేరికన్నారు. షర్మి లమ్మ సీఎం రమేశ్‌ విమానంలో వెళ్లడం.. టీడీపీ నేత బీటెక్‌ రవిని బ్రదర్‌ అనిల్‌ కలవడం యాదృచ్ఛికమని తాము అనుకోవడం లేదన్నారు. క్రిస్టియన్‌ ఓట్లను ప్రభావితం చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ గతంలో ఇదే టీడీపీ నేతలు బ్రదర్‌ అనిల్‌పై ఏ స్థాయిలో దుమ్మెత్తిపోశారో అందరికీ గుర్తుందన్నారు. టీడీపీ నేత బీటెక్‌ రవిని ఎయిర్‌పోర్ట్‌లో బ్రదర్‌ అనిల్‌ మర్యాదపూర్వకంగా కలవడం వంటి వాటని్నంటినీ పరిశీలిస్తే షర్మిలమ్మ కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది అర్థమవుతోందన్నారు.

కాంగ్రెస్‌లో ఎవరు చేరినా నష్టం లేదు..
రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి, పార్టీ పెట్టి, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా ఆపార్టీ లో చేరడం షర్మిలమ్మ ఇష్టమని సజ్జల అన్నారు. అండమాన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకూ ఎక్కడైనా పని చేస్తానని ఆమె అన్నారని, రాష్ట్రంలోనే రాజకీయం చేస్తానని ప్రకటించలేదన్నారు. ఒకవేళ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్‌ నాయకురాలిగానే చూస్తామన్నారు.

అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ కలసి కుట్ర..
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని సజ్జల పునరుద్ఘాటించారు. వైఎస్‌ మరణం తర్వాత అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు.

వైఎస్సార్‌సీపీని స్థాపించాక కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉపఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను, వైఎస్‌ విజయమ్మను ఓడించడం ద్వారా పార్టీని మొగ్గలోనే తుంచేయడానికి అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై కుట్ర చేశాయన్నారు. పులివెందుల ఉపఎన్నికలో విజయమ్మపై వివేకాను పోటీకి పెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల్లో వైఎస్‌ విజయమ్మ 80 శాతం ఓట్లు సాధించి ఘనవిజయం సాధిస్తే.. కడప లోక్‌సభ స్థానం నుంచి జగన్‌ రికార్డు మెజార్టీతో విజయం సాధించారన్నారు.  

ఆది నుంచి కాంగ్రెస్‌తోనే చంద్రబాబు..
మహానేత వైఎస్‌ మరణించినప్పటి నుంచి  చంద్రబాబు తెరవెనుక కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారని సజ్జల ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ను ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలో భాగంగానే షర్మిల చేరికని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో జరగబోయే డ్రామా అంతా చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరగనుందన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా.. ప్రజలకు సంబంధం లేని సంచలనాలు సృష్టించడమే చంద్రబాబు నైజమన్నారు.

అభ్యర్థుల మార్పు సహజమే..
ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుపై అన్ని పార్టీల్లోనూ సహజ ప్రక్రియేనని సజ్జల ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సమన్వయకర్తలను మారుస్తున్నారని చెప్పారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయం, ప్రజల ఆకాంక్షలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని.. అందరితో చర్చించే అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చుతున్నామని చెప్పారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని.. వ్యక్తిగత కారణాలతోనే కొందరు పార్టీని వీడుతున్నారని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement