దసరా తర్వాతే కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. సీపీఐకి ఎదురుదెబ్బ! | Sakshi
Sakshi News home page

దసరా తర్వాతే కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. సీపీఐకి ఎదురుదెబ్బ!

Published Sun, Oct 22 2023 10:36 AM

Second List Of Congress Candidates Will Be Announced After Dussehra - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బస్సు యాత్రలో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాగా, దసరా తర్వాతే రెండో జాబితా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, దసరా తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇక, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మెజారిటీ కసరత్తు పూర్తి చేసింది. అవసరాన్ని బట్టి అభ్యర్ధులతో కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడనున్నట్టు సమాచారం. మరోవైపు, సీట్ల కేటాయింపులో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. చెన్నూరులో అభ్యర్థిని ప్రకటించక ముందే సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సీపీఐ అనుబందం  సంఘం ఎఐటీయూసీ.. చెన్నూరులో సీపీఐ పోటీ చేయడంపై వ్యతిరేకత చూపించింది. సీపీఐ అక్కడ పోటీ చేయవద్దంటూ ఏకంగా తీర్మానం చేసింది. బలం లేని చోట పోటీ వద్దంటూ తీర్మానంలో పేర్కొంది. వెంటనే చెన్నూర్  టిక్కెట్  తీసుకునే ప్రతిపాదనను  విరమించుకోవాలని  మందమర్రి కార్మిక సంఘం  విభాగం కోరింది. దీంతో, ఆదిలోనే సీపీఐకి ఊహించని షాక్‌ తగిలినట్టు అయ్యింది. 

Advertisement
Advertisement